వినాయక చవితి వేడుకలలో కీలకమైన పందిళ్లు మండపాలు ఏర్పాటు కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ లో అనుమతి తప్పనిసరి పట్టణ సీఐG.రాజేశ్వరరావురానున్న వినాయక చవితి వేడుకలు సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు మరియు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు చిలకలూరిపేట పట్టణ సీఐ G. రాజేశ్వరరావు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో కమిటీగా ఏర్పడి వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి. పంచాయతీ/మున్సిపాలిటీ/ నగర పాలక సంస్థ లేదా ప్రయివేట్ స్థలాలలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత స్థల యజమాని లేదా సంబంధిత విభాగపు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. పోలీస్ అనుమతి లేకుండా విగ్రహలు ఏర్పాట్లు చేయరాదు. వీటితో పాటు ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆయా విభాగాలు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పందిళ్ళు/మండపాలు వద్ద ముందస్తుగా ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకోవాలి. పందిళ్లు/మండపాలలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలి. విద్యుత్ వైర్లను మరియు ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రతలు వహించాలి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరుగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలి. గణేష్ ప్రతిమల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం మరియు విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియజేయాలి. ఏవైనా మార్పులు ఉండే తక్షణమే స్ధానిక పోలీస్ లకు తెలియపరచాలి. పందిళ్ళు/మండపాలు వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ మరియు నియంత్రణ నింబంధనలు-2000 ప్రకారం స్పీకర్లను ఉపయోగించాలి. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వాడాలి. రాత్రి వేళల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండవలెను. ఎవరికి వారు తగు భద్రతా ఏర్పాట్లు చేసుకొనవలెను. రాత్రి సమయాలలో పందిళ్ళు/మండపాలలో విలువైన వస్తువులు ఉంచరాదు. వినాయక పందిళ్ళు గాని, విగ్రహం పెట్టే ప్రదేశం గాని రోడ్డుపైన ఉండరాదు. బ్యానర్లు/ప్లెక్సీలతో రోడ్డుపైన రాకపోకలకు అంతరాయం కలిగించరాదు. వినాయక చవితి ఉత్సవాల సమయంలో బాణసంచాలను ఉపయోగించరాదు. ఊరేగింపు సమయంలో పోలీస్ వారి అనుమతి లేకుండా వేషధారణలు, ఎక్కువ శబ్ధము వచ్చే వాయిద్యాలు అనగా డి.జే తదితరాలకు అనుమతి లేదు. వినాయక ఉత్సవ కమిటీ మెంబర్లు నిమజ్జనానికి ఉపయోగించే వాహనం యొక్క స్థితిని గమనించి మంచి కండిషన్లో ఉండే బండిని మరియు లైసెన్స్ ఉన్న మరియు అనుభవం ఉన్న డ్రైవర్లను ఉపయోగించవలెను. పందిళ్ళ వద్ద మరియు ఊరేగింపు సమయాలలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నాట్య ప్రదర్శనలు జరుగకుండా మరియు మద్యం లేదా మత్తు పదార్ధాలను సేవించిన వారు లేకుండా ఉండే విధంగా ఉత్సవ నిర్వాహకులు బాధ్యత వహించాలి. నిమజ్జన ఊరేగింపుకు అనుమతించిన సమయం, నిమజ్జనకు కేటాయించిన ప్రదేశం మరియు ఊరేగింపునకు కేటాయించిన మార్గములలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు మరియు భద్రత కొరకు తగినంత మంది కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి. పండుగ రోజు నుండి నిమర్జనం వరకు జరిగే పూజలు, వేడుకల సందర్భాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ప్రజలందరూ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని పట్టణ సీఐ G. రాజేశ్వరరావు కోరారు. వినాయక విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులే తగిన భద్రతా ఏర్పాట్లు చూసుకోవాలని, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉంటే ముందుగానే స్ధానిక పోలీస్ అధికారులకు/డయల్ 112 తెలియపరచాలని పట్టణ సీఐ సూచించారు. వినాయక చవితి పర్వదినం, ఉత్సవాల నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పట్టణ సీఐ G. రాజేశ్వరరావు తెలిపారు. గణేష్ ప్రతిమలు ఏర్పాటు చేసిన మండపాలు/ ప్రదేశాలలో భద్రతాపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. గణేష్ ప్రతిమల భద్రతలో భాగంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నిత్యం అప్రమత్తంగా ఉండే విధంగా కమిటి సభ్యులు, నిర్వాహకులు ఆ ప్రదేశాలలో నిద్రించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండే స్వభావం ఉన్న వస్తువులు ప్రతిమల ప్రాంతంలో ఉంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డిజె సౌండ్ సిస్టం లేదా రికార్డింగ్ డాన్సులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం జరిగే ప్రదేశాలు, ఆయా ప్రాంతాలలో కరెంటు సౌకర్యం, గజ ఈతగాళ్లు, వైద్య సిబ్బంది, మంటలను ఆర్పే వస్తువులు తదితరాలను సిద్ధం చేసుకునేందుకు రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీ విభాగాలతో సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బంది కల్గకుండా వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని పట్టణ సీఐ తెలిపారు...
September 14, 2023
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

