చెరువులో శవమై తేలిన ఇంజనీరింగ్ విద్యార్థి
చిలకలూరిపేట రూరల్ పరిధిలో తీవ్ర విషాదం
కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
చిలకలూరిపేట గ్రామీణం: కాలేజీకి వెళ్లిన యువ ఇంజనీరింగ్ విద్యార్థి చెరువులో శవమై తేలిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.ప్రకాశం జిల్లా పల్లమల్లి గ్రామానికి చెందిన గనిపినేని అభిలాష్ (22) ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్నాడు. స్వగ్రామం నుంచి కాలేజీకి వెళ్లేందుకు బయలుదేరిన అభిలాష్ తిరిగి రాలేదు. కాగా, చిలకలూరిపేట రూరల్ పరిధిలోని 52 ఎకరాల న్యూ ఎస్.ఎస్. ట్యాంక్ చెరువు గట్టుపై అతని బ్యాగ్, ఆధార్ కార్డు, చెప్పులు పడి ఉండటాన్ని గుర్తించారు.బుధవారం ఈ విషయం వెలుగుచూడటంతో అధికారులు, స్థానికులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం చెరువులో అభిలాష్ మృతదేహం నీటిపై తేలియాడటాన్ని స్థానికులు గమనించి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మృతదేహాన్ని వెలుపలికి తీశారు. చేతికొచ్చిన కొడుకు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటనపై చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

