గుంటూరు జిల్లా: యడ్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అద్దె భవనాల్లో నడుస్తోందని, వసతులు లేవని గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. బుధవారం విడదల రజిని తాను స్వయంగా పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం గొట్టిపాటి శివపార్వతి మాట్లాడుతూ ప్రైవేటు భవనాల్లో ప్రభుత్వ పాఠశాల నడుస్తోందని, వారికి తామే అద్దె కట్టాల్సి వస్తోందని, ఏడాదిపాటు తమ జీతాల నుంచే అద్దె చెల్లించామని, ఇక తమ వల్ల కాదని, దయచేసి ఈ పాఠశాలను మరో పాఠశాలలో విలీనం చేసేందుకు చొరవచూపాలని విన్నవించుకున్నారు. వీరి దుస్థితి విన్న ఎమ్మెల్యే చలించిపోయారు. 300 మందికిపైగా పిల్లలు ఉన్న పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. మరేం పర్లేదని, ఎంత ఖర్చయినా తాను భరిస్తానని భరోసా ఇచ్చారు. ఇకపై నెలనెలా అద్దె తానే కడతానని, సంతోషంగా పాఠశాలను ఇక్కడే కొనసాగించండని అభయమించారు. త్వరలోనే భూములు అందుబాటులో ఎక్కడ ఉన్నాయో చూసి, అక్కడే ప్రభుత్వ ఆర్థిక సాయంతో శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం చదువుల విప్లవాన్ని తీసుకొస్తోందని, ఇలాంటి ఈ ప్రభుత్వంలో విద్యాలయాలు ఇలాంటి దుస్థితిలో ఉండటానికి వీల్లేదని, అవసరమైతే తాను వీఆర్ ఫౌండేషన్ నుంచి వ్యక్తిగత సాయం చేసైనా పరిస్థితుల్లో మార్పు వచ్చేందుకు తన వంతు సాయం చేస్తానని తెలిపారు. అమ్మ ఒడి, నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, యూనిఫాంలు, పుస్తకాలు, బూట్లు, సాక్సులు తదితరాలన్నీ ఉచితంగా పంపిణీ... లాంటి ఎన్నో విప్లవాత్మక మార్పులను విద్యావ్యవస్థలో తీసుకొస్తున్న అద్భుతమైన నాయకుడు మనకు ఇప్పుడు సీఎంగా ఉన్నారని గుర్తుచేశారు. దేశంలోనే పటిష్టమైన విద్యావ్యవస్థను నెలకొల్పేదిశగా మన రాష్ట్రం అడుగులు వేస్తోందన్నారు. ఇలాంటి ప్రభుత్వంలో తాను భాగస్వామిని కావడం తనకు ఎంతో గర్వకారణమన్నారు. యడ్లపాడులోని జెడ్పీ ఉన్నత పాఠశాల విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యడ్లపాడు మండల తహశీల్దార్ సుజాత, ఎంపీడీవో మాధురి, ఆయా విభాగాల అధికారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కల్లూరి బుజ్జి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
June 11, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చదువుల విప్లవం తీసుకొస్తున్న ప్రభుత్వం మాది: ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

