చిలకలూరిపేట:
వీరి మెడపై ఎప్పుడూ కత్తి వేలాడుతునే ఉంటుంది. ఎప్పుడు ఏ అధికారి రేపటి నుంచి పనికి రావద్దు అని అంటారో ... అని ప్రతి క్షణం బయపడుతూ పనిచేయాల్సిందే. అలా అని వీరు చేసిది ఏసీ రూముల్లో ఆఫీసులో చేసే పనికాదు. చెత్త చెదారాలు, కాల్వలు శుభ్రం చేస్తూ దుర్బరజీవితం గడిపే మున్సిపల్ పారిశుద్య కార్మికులు. ఊరు నిద్రలేవక ముందే లేచి వీధుల్ని ఊడ్చి, కాల్వల్లో పూడికలు తీసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే వీరు మనకు చేసే సేవ అత్యంత మౌలికమైనదే కాదు ఎంతో ప్రాథమికమైనది కూడా. సమాజం అనునిత్యం వెలివేస్తున్నా, వారిని శతాబ్దాలుగా తరిమి కొడుతున్నా.. తరతరాలుగా ఈ సమాజం మురికిని కడిగిపారేస్తోంది మాత్రం వాళ్ళే.ఎర్రటి ఎండలో, వానలో, చలిలో వళ్లు దాచుకోకుండా పనిచేసే వీరి ఉద్యోగాలు కూడా గాలిలో దీపంగా మారుతున్నాయి .
పేట మున్సిపాలిటీలో రోడ్డున పడ్డ ఆరుగురు పారిశుద్య కార్మికులు
చిలకలూరిపేట మున్సిపాలిటీని గత మున్సిపల్ ఎన్నికలకు 38వార్డులుగా విభజించారు. సమీప గ్రామాలైన గణపవరం, మానుకొండవారిపాలెం, పసుమర్రును మున్సిపాలిటీలో విలీనం చేశారు. పారిశుధ్య నిర్వహణకు 100 మైక్రో ప్యాకేజీలుగా విభజించి 265 మంది కాంట్రాక్టు, 45 పర్మినెంట్ పారిశుధ్యకార్మికులతో పనులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆరు గురు పారిశుద్య కార్మికులను విధుల నుంచి తొలగించారు. సీపీఐ నాయకుల ఆందోళనలతో వారిలో ముగ్గురిని తిరిగి విధుల్లో చేర్చుకున్నారు. తిరిగి శుక్రవారం ఉదయం మరో డివిజన్లో మరో ముగ్గురిని తొలగించారు.
ఇది ఇక్కడితో ముగిసేటట్టు లేదు..
చాలీ చాలనీ జీతాలతో బతుకు బండి లాక్కొస్తున్న వీరి ఉద్యోగాలపై కన్ను పడింది. వారికి అనుకూలంగా ఉన్న వారిని పారిశుద్య కార్మికులగా పెట్టుకోవాలని తప్పులు కనిపెట్టి, సాకులు వెతికి మరీ పారిశుధ్య కార్మికులను తొలగించటానికి రంగం సిద్దం చేశారు. ఇటీవలే 40 మంది కార్మికులను తొలగించి కొత్తగా వచ్చే పారిశుద్య కార్మికుల ద్వారా లబ్ది పొందాలని భావించారు. అయితే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉన్న మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వేగంగా స్పందించటం, ఏ ఒక్క కార్మికున్ని తొలగించినా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్దమౌతామని ప్రకటించటంతో కొంతతగ్గినట్లు కనిపించినా , తిరిగి ఆరుగురు కార్మికులను తొలగించి వారిని రోడ్డున పడవేశారు. దీంతో మన కోసం మన ఆరోగ్యం కోసం మొత్తం సమాజం సంక్షేమం కోసం తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి కనీసం జీవనాదాయం లేక అహరహం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి. సమాజం తమను నిరాదరిస్తున్నా , అదే సమాజాన్ని ఆదరిస్తున్న ఆరోగ్య ప్రదాతలు ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో అని అల్లాడుతున్నారు.
పారిశుధ్యంలో గతంలోనే పేట మున్సిపాలిటీకి అవార్డు..
చిలకలూరిపేట మున్సిపాలిటీ గతంలోనే రాష్ట్రంలోనే తొలిసారిగా పారిశుధ్యం విషయంలో చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. అప్పట్లో స్వచ్చంధ సంస్థలకు పారిశుధ్య పనులు అప్పగించటంతో ప్రైవేటు వారితో పోల్చితే పారిశుద్యం మెరుగుపడింది. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల వల్లే గతంలో స్వచ్చ అవార్డును కూడా అందుకుంది. కుక్కను కొట్టాలంటే పిచ్చిదనే ముద్ర వేయాలన్న కుట్రలతో వివిధ సాకులతో కార్మికులను సాగనంపటం ప్రస్తుతం వివాదస్పందంగా మారింది. పారిశుధ్య కార్మికుల తొలగించి కొత్త వారిని నియమించి లబ్దిపొందాలన్న తలంపుతోనే ఇటువంటి ప్రయత్నాలకు ఒడిగడుతున్నారని కార్మికసంఘ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఉద్యమ కార్యాచరణ దిశగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అడుగులు వేస్తుంది. జరుగుతున్న పరిణాలను పరిశీలిస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని కొనసాగించేందుకు ఇప్పటికే తీర్మానం చేశారు. శుక్రవారం ర్యాలీ నిర్వహించి ధర్న చేశారు. మరోసారి వినతి పత్రం అందించి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.

