చిలకలూరిపేట: పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల సాధనకు సంఘటితంగా మరెన్ని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ తెలిపారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సోమవారం పట్టణంలో వామ పక్ష ఏఐటీయూసీ, సీఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఎన్ ఆర్ టీ సెంటర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ భాస్కర్ సెంటర్, చౌత్రా సెంటర్, మెయిన్ బజార్, గడియార స్థంభం సెంటర్ మీదుగా కొనసాగి కళామందిర్ సెంటర్ చేరుకుంది. అక్కడ సభలో జంగా అజయ్కుమార్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ, అమిత్ షాల ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో కార్మికవర్గంపై కత్తికట్టి దాడి చేస్తుందని ఆరోపించారు. . 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ప్రజల కష్టజీవుల రక్తమాంసాలతో నిర్మించుకున్న కోటానుకోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వరంగాన్ని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీతో సహా బ్యాంకులు, ఇన్సూరెన్స్, రైల్వేలు, విమానాలు, రక్షణ ఉత్పత్తులు, విద్యుత్, ఆయిల్, బొగ్గు మొత్తం ధ్వంసం చేస్తున్నారు. కారుచౌకగా వాటి మిగులు భూములను అదానీ, అంబానీలకు అప్పచెప్తున్నారని విమర్శించారు. 44 చట్టాలను నాలుగు కార్మిక కోడ్లుగా మార్చి, కార్మికుల ఉమ్మడి బేరసారాల శక్తిని, సంఘం పెట్టుకొనే హక్కులను కొల్లగొట్టి కార్మికులను, ఉద్యోగులను యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు వదలివేశారని ఆరోపించారు. ఈ సమ్మె మన కార్మికవర్గ హక్కుల రక్షణకే గాక దేశ సమగ్రత ఐక్యతలకు సంబంధించిన అంశంగా భావించి కార్మికులు, ఉద్యోగులు ఈ పోరాటంలో భాగస్వాములయ్యారని తెలిపారు. విశాఖ స్టీల్ పరిశ్రమతోపాటు దేశంలోని ఏ ప్రభుత్వరంగ పరిశ్రమను, సంస్థలను ప్రైవేటీకరించరాదని, ప్రతి కార్మికుడికి రూ. 26 వేలు నెలసరి కనీస వేతనంగా నిర్ణయించి అమలు చేయాలని, ఏకపక్షంగా ఆమోదించిన లేబర్ కోడ్లను తక్షణం రద్దుచేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చిలకలూరిపేట మున్సిపాలిటిలో తొలగించిన కాంట్రాక్ట్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం అనుబంధ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై రాధాకృష్ణ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచుతామని జీ.వో. నెం. 519 విడుదల చేసి. 2 సం॥లు దాటినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. అనేక పథకాలలో పనిచేసే కార్మికులకు పనిచేసిన రోజులక్కూడా జీతాలు ఇవ్వనందున నెలల తరబడి జీతాల బకాయిలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కార్మిక లోకం సమిష్టిగా నిలచి ఉద్యమాలు చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా కార్యదర్శి నాగబైరు రామసుబ్బాయమ్మ, ఏవైఐఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, ఏఐటీయూసీ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు పేలూరి రామారావు, దాసరి వరహాలు, ఉపాధ్యక్షుడు సీఆర్ భారతి,చేరుకుపల్లి సృజన్ ఏపీ మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చిలకలూరిపేట కార్యదర్శి బి చిన యోగయ్య, నాయకులు చెంచయ్య, జయరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తుబాటి సుభాని మేస్త్రి , సీఐటీయూ మండల కార్యదర్శి పేరు బోయిన వెంకటేశ్వర్లు, సీపీఎం నాయకులు బొల్లు శంకరరావు, సాతులూరి లూధర్, కె రోశయ్య, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం రాధాకృష్ణ, ముస్లిం మైనార్టీ వెల్పేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ, నాయకులు నాగుర్వలి, మస్తాన్వలి మద్దతు ప్రకటించారు.

