చిలకలూరిపేట: పట్టణంలో మున్సిపల్ ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగడం ఖాయం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్ర చర్చ నడుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే నెల 6వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 48 వార్డులు ఉండవచ్చని తెలుస్తోంది.
గత ఫలితాలు – ఏకగ్రీవాల లెక్కలు:
గత మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలో మొత్తం 38 వార్డులు ఉండగా, అందులో 3 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.17వ వార్డు (రంగారెడ్డి కాలనీ) అనురాధ (వైసీపీ),29వ వార్డు (సుభాన్ నగర్, పురుషోత్తమపట్నం) యూసుఫ్ అలీ (వైసీపీ), 30వ వార్డు (పురుషోత్తమపట్నం) ఖాజా భాను (వైసీపీ)
మిగిలిన 35 వార్డులకు ఎన్నికలు జరగ్గా టీడీపీ 8 వార్డుల్లో విజయం సాధించగా, వైసీపీ ఏకగ్రీవాలతో కలిపి 30 వార్డులను కైవసం చేసుకుని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది.
ఈసారి టీడీపీ ఏకగ్రీవాలపై చర్చ – వ్యూహాల్లో వైసీపీ:
ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 48 వార్డుల్లో ఎన్ని స్థానాలు ఏకగ్రీవం అవుతాయనేది ఆసక్తికరంగా మారింది. కూటమి/టీడీపీ తరఫున ఎన్ని వార్డులు ఏకగ్రీవం అవుతాయనే దానిపై జోరుగా చర్చ సాగుతుండగా, మరోవైపు వైసీపీ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు పావులు కదుపుతోంది.
గతంలో దాదాపు 12 వార్డుల్లో మైనార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈసారి కూడా మైనార్టీ, ఎస్సీ ప్రాబల్యం ఉన్న వార్డులపై ప్రత్యేక దృష్టి సారించి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది. టీడీపీకి గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యంగా ఆ పార్టీ కీలక నేతలు ఇప్పటికే అంతర్గత, రహస్య సమావేశాలు నిర్వహించి వార్డుల వారీగా వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ వెలువడితే పట్టణంలో రాజకీయం మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

