గ్రామాలను మినహాయించి పట్టణ పరిధి వరకే ఎన్నికలు
38 వార్డులా? 48 వార్డులా? అనే అంశంపై జోరుగా చర్చ
చిలకలూరిపేటలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయ వాతావరణం
చిలకలూరిపేట:గత కొద్ది రోజులుగా చిలకలూరిపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధతకు, తీవ్ర ఉత్కంఠ వాతావరణానికి హైకోర్టు తీర్పుతో తెరపడింది. మున్సిపాలిటీలో విలీనమైన మూడు గ్రామాలను తిరిగి పంచాయతీల్లోనే కొనసాగిస్తూ, కేవలం పట్టణ పరిధి వరకే ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగళవారం సాయంత్రం నుంచి పట్టణంలో ఎక్కడ చూసినా మున్సిపల్ ఎన్నికల గురించే ప్రధానంగా చర్చ సాగుతోంది.
గత ఎన్నికల సమీకరణాలు..గ్రామాల వాటా:
గతంలో 38 వార్డులతో చిలకలూరిపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో 1 నుండి 5 వరకు గల ఐదు వార్డులు గణపవరం, రెండు వార్డులు పసుమర్రు, ఒక వార్డు మానుకొండ వారిపాలెం పరిధిలోకి వచ్చాయి. అంటే మొత్తం 38 వార్డుల్లో రూరల్ పరిధిలోని మూడు గ్రామాల నుంచే 8 వార్డులు ఉండగా, పట్టణ పరిధి నుంచి 30 వార్డులు ఉండేవి.
38 వార్డులా? 48 వార్డులా?:
ప్రస్తుతం ఆ మూడు గ్రామాలను మినహాయించిన నేపథ్యంలో ఎన్నికలు ఎన్ని వార్డులకు నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రకారం చిలకలూరిపేట మున్సిపాలిటీని 48 వార్డులుగా విభజించినట్లు గతంలో అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో ఎన్నికలు 48 వార్డులకు జరుగుతాయా లేక పాత పద్ధతిలోనే వార్డుల సంఖ్యను ఖరారు చేస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అభ్యర్థులకు ఊరటనిచ్చే లెక్కలు:
ఒకవేళ పట్టణ పరిధి వరకే 48 వార్డులకు ఎన్నికలు జరిగితే.. ఒక్కో వార్డులో సుమారు 1,800 నుండి 2,200 లోపు మాత్రమే ఓటర్లు ఉండే అవకాశం ఉంది. వార్డు పరిధి చిన్నదిగా మారితే పోటీ చేసే అభ్యర్థులకు విస్తృతంగా ప్రచారం చేసుకునేందుకు, ప్రతి ఓటరును నేరుగా కలిసేందుకు సులువవుతుంది. అంతేకాకుండా ఎన్నికల ఖర్చు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉండటంతో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
చివరకు ఎన్ని వార్డులతో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతుందనేది అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

