ప్రాణం పోయే వరకు టీడీపీలోనే ఉంటా: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
మార్టూరు: తాను తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నట్టు కొనసాగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రకాశంజిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రకటించారు. ఆదివారం ప్రకాశంజిల్లా మార్టూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాను టిడిపిలోనే కొనసాగుతాననీ, పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. ఏలూరి సాంబశివరావు 2014, 2019 లలో వరుసగా పర్చూరు నుంచి విజయం సాధించారు. ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనీ, ప్రకాశంజిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మంతనాలు కూడా పూర్తయ్యాయని రాజకీయవర్గాలు భావించాయి. ఏలూరితో పాటు గుంటూరుజిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ కూడా వైసీపీలో చేరుతున్నట్టు ఇటీవల విస్తృతంగా ప్రచారమైంది. ఇపుడు ఏలూరి ప్రకటనతో వారి చేరిక ప్రచారానికి బ్రేక్ పడింది.