ఎడ్లపాడు: దింతెనపాడు గ్రామ ఎస్సీ కాలనీలోని పాఠశాలలో నిర్వహిస్తున్న నాడు- నేడు పనులను ఆదివారం ఎమ్మెల్యే విడదల రజిని పరిశీలించారు. పనులు ముందుకు సాగకపోతుండటం చూసి అసంతృప్తి వ్యక్తంచేశారు. నాడు-నేడు.. తమ ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమని, పనులు నిదానంగా జరిగితే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ముఖ్యంగా యడ్లపాడు మండలంలో నాడు-నేడు పనుల్లో బాప్యం బాగా కనిపిస్తోందన్నారు. ఎంఈవో తమకు సహకరించడంలేదంటూ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తనకు ఫిర్యాదులు చేస్తున్నారని, పరిస్థితి ఇలానే ఉంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఎవరు ప్రవర్తించినా కఠినంగా ఉంటామని స్పష్టంచేశారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, హెచ్ఎంల మధ్య ఎక్కడైనా సమన్వయం లేకపోతే చొరవతీసుకుని సరిచేయాల్సిన బాధ్యత ఎంఈవోలదేనని స్పష్టంచేశారు. లాక్డౌన్ కాలంలో ఎంఈవోలు సెలవులకే పరిమితమవుతున్నట్లు పరిస్థితి ఉందని, ప్రతి రోజూ ఎంఈవోలు పాఠశాలలు తనిఖీ చేయాలని ఆదేశించారు. వారం వారం అన్ని మండలాల ఎంఈవోల నుంచి తాను నాడు-నేడు పనుల వివరాలు అడుగుతానని చెప్పారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతి గురించి చెప్పాల్సిందేనని స్పష్టంచేశారు. యడ్లపాడు ఎంఈవో తోటి అధికారులతో వాడుతున్న భాష చాలా దారుణంగా ఉంటోందని ఆయా పాఠశాలల సిబ్బంది తన వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారని తెలిపారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ దుర్భాషలాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అందరినీ గౌరవించి మాట్లాడాలని హితవు పలికారు. నాడు-నేడు పనుల్లో మండల విద్యాశాఖ అధికారి పర్యవేక్షణ లేదనే విషయం తనకు స్పష్టమవుతోందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దింతెనపాడు, తిమ్మాపురం గ్రామాల పాఠశాలల నాడు-నేడు పనుల గురించి ఎంఈవోను అడగగా.. ఆయన సరిగా స్పందించలేకపోయారు. పంచాయతీరాజ్ అధికారుల నుంచి వివరాలు తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నాడు-నేడు పనులు ఎలా ముందుకుసాగుతాయని మండిపడ్డారు. తాను ఇకపై నాడు-నేడు పనులకు సంబంధించి ఎవరినీ అడగనని, ఎంఈవోను మాత్రమే అడుగుతానని, ఎప్పటికప్పుడు వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. అన్ని శాఖలను సమన్వయపరుచుకుంటూ పనులు తర్వగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. కష్టపడి పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలనే పట్టుదలతో ఉండే అధికారులే తమకు కావాలని, బాధ్యతారాహిత్యంగా ఉండేవారు తమకు అవసరం లేదని, అలాంటి అధికారులు వేరే దారి చూసుకుంటే మంచిదని స్పష్టంచేశారు. ఎమ్మెల్యేతోపాటు ఎంపీడీవో మాధురి, పీఆర్ ఏఈ హరగోపాల్, సచివాలయ, పాఠశాల సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులు శివనాగేశ్వరరావు, శ్యామ్ పాల్, ఇతర నాయకులు ఉన్నారు.
May 31, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: పనులు నిదానంగా జరిగితే సహించేది లేదు: ఎమ్మెల్యే విడుదల రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

