728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 5, 2020

43లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు: ఐసీఎంఆర్‌

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. తాజాగా కేసుల తీవ్రత పెరుగుతున్న తరుణంలో కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా ముమ్మరంగా చేపడుతున్నారు. ఇప్పటివరకు దేశంలో 43లక్షల 86వేల  శాంపిళ్లను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. గడచిన 24గంటల్లోనే 1,43,661 శాంపిళ్లు పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. అయితే,  ఈనెల 8 నుంచి దేశవ్యాప్తంగా దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు తెరచుకోనుండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి సంబంధించిన తాజా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీచేసింది.

మహారాష్ట్రలో 77వేలు దాటిన కేసులు..
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. తాజాగా రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు సంఖ్య 77,793కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 2710మంది మృత్యువాతపడ్డారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 2933కేసులు, 123 మరణాలు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కొవిడ్‌ మహమ్మారి తీవ్రత మరింత ఎక్కువైంది. ఇప్పటికే నగరంలోని కొవిడ్‌ రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దాదాపు 94శాతం కొవిడ్‌ ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. వీటిల్లో దాదాపు 98శాతం ఐసీయూ పడకలు నిండిపోగా, 85శాతం వెంటిలేటర్లు ఇప్పటికే వినియోగంలో ఉన్నాయి.

తమిళనాడులో ఒకేరోజు 1384కేసులు..
మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. గడచిన 24గంటల్లో రాష్ట్రంలో 1384 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో 12కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 27,256కి చేరగా వీరిలో ఇప్పటివరకు 220మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా తీవ్రతలో తమిళనాడు దేశంలోనే రెండవ స్థానంలో ఉంది.

దిల్లీలో 25వేలు దాటిన కేసులు..
దేశ రాజధాని దిల్లీలో కొవిడ్‌ విలయతాండవం చేస్తోంది. తాజాగా నిన్న ఒక్కరోజే కొత్తగా 1359 పాజిటివ్‌ కేసులు బయటపడగా, మరో 44మంది కరోనా సోకినవారు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 25వేలు దాటింది. దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో దిల్లీ మూడవ స్థానంలో కొనసాగుతోంది. కొవిడ్‌ మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో అక్కడి అధికారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి దిల్లీకి రాకపోకలు సాగించేవారిపై ఇప్పటికే ఆంక్షలు విధించారు.

గుజరాత్‌లో 1155కి చేరిన మరణాలు..
దేశంలో అత్యధిక కరోనా తీవ్రత ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ నాల్గవ స్థానంలో ఉంది. కొవిడ్‌ మరణాల్లో మాత్రం దేశంలోనే రెండవ స్థానంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 484పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో మొత్తం బాధితుల సంఖ్య 18,584కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య కలవరపెడుతోంది. నిన్న ఒక్కరోజే 33మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్ సోకి మరణించిన వారిసంఖ్య 1155కి చేరింది. మహారాష్ట్ర అనంతరం ఎక్కువ కొవిడ్‌ మరణాలు గుజరాత్‌లోనే చోటుచేసుకుంటున్నాయి. ఇక ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో 377, పశ్చిమబెంగాల్‌లో 355, ఉత్తర్‌ప్రదేశ్‌లో 245, రాజస్థాన్‌లో 213, తెలంగాణలో 105 మంది కరోనా సోకి మరణించారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: 43లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు: ఐసీఎంఆర్‌ Rating: 5 Reviewed By: NEWS UPDATE