అమరావతి: పర్యావరణ పరిరక్షణ జనసేన మూల సిద్ధాంతమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతి ప్రేమికులకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యావరణం కంటికి కనిపించని విలువైన సంపద అని.. ఈ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందన్నారు. అడవులు, కొండలు, నదులను కాపాడుకోవాలని సూచించారు. మన ఆరోగ్యం పర్యావరణంతోనే ముడిపడి ఉందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానాన్ని జనసేన కాంక్షిస్తోందని.. ఇందులో భాగంగానే ‘మన నది- మన నుడి’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చక్కబడగానే ‘మన నది - మన నుడి’ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళతామని పవన్ ఈ సందర్భంగా తెలిపారు. పర్యావరణానికి హితమైన మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. పర్యావరణాన్ని విషతుల్యం చేసే పరిశ్రమలపై పార్టీ తరఫున నిరసన గళం వినిపిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆరోగ్య ప్రదాయని అయిన పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని ఈ సందర్భంగా పవన్ విజ్ఞప్తి చేశారు.

