విశాఖ: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై విశాఖలో రెండో రోజు హైపవర్ కమిటీ విచారణ కొనసాగుతోంది. జీవీ ఎంసీ సమావేశ మందిరంలో గ్యాస్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు, వివిధ పార్టీల నేతలతో హైపవర్ కమిటీ వేర్వేరుగా భేటీ అయింది. ఎల్జీ దుర్ఘటన ప్రభావిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన 21 మంది గ్రామస్థులు సమావేశంలో పాల్గొన్నారు. ఆధార్కార్డులు పరిశీలించిన అనంతరం పోలీసులు వారిని లోపలికి పంపుతున్నారు. ఆధార్ కార్డు వివరాలు సరిగ్గా లేవని సమావేశం వద్దకు అనుమతించడం లేదని మృతుల బంధువులు వాపోయారు. తమ సమస్యలు ఎవరూ పట్టించుకోలేదని, కమిటీ వద్ద అయినా గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ దుర్ఘటనలో మృతి చెందిన కనకరాజు భార్య సమావేశంలో పాల్గొనేందుకు రాగా.. అనుమతిలేదని పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె జీవీఎంసీ గేటు వద్దే సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.