చిలకలూరిపేట: స్థానిక నూతన వ్యవసాయమార్కెట్ యార్డులో శుక్రవారం వైఎస్సార్ సమీకృత వ్యవసాయపరిశోధనా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాత కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నదని చెప్పారు. వైఎస్సార్ రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, ధరల స్థిరీకరణ నిధి, సాగుకు తొమ్మిది గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్, సున్నా వడ్డీకే రుణాలు లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న ఘనత తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందని తెలిపారు. ఈ రోజు శంకుస్థాపన చేస్తున్న ల్యాబ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు మార్కెట్లోకి విడుదల కాకముందు ఒకసారి, రైతులకు అందబోయే ముందుకు మరోసారి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. దీనివల్ల కల్తీ పురుగుమందులు, ఎరువులు, విత్తనాల బారి నుంచి అన్నదాతలను రక్షించవచ్చని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 147 నియోజకవర్గాల్లో ఇలాంటి ల్యాబ్ లను నిర్మిస్తున్నామని తెలిపారు. అందుకోసం రూ.200 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. అగ్రి ల్యాబ్లలో రైతులు ఎవరైనా సరే వారు కొనుగోలు చేసిన విత్తనాలు, పురుగుమందులను ఈ పరీక్షించుకనే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఏదైనా కల్తీ తేలితే జిల్లా స్థాయి ల్యాబ్లలో మరోసారి పరీక్షించి కల్తీలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట మండలాధ్యక్షుడు దేవినేని శంకరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ తల్హాఖాన్, ఆయా గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
June 12, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: వైఎస్సార్ సమీకృత అగ్రిల్యాబ్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రజిని
Rating: 5
Reviewed By: NEWS UPDATE

