చిలకలూరిపేట టౌన్:
పట్టణంలోని కళామందిర్ థియేటర్ వెనక బొబ్బల సత్యనారాయణ వీధిలోని ఒక యువకునికి, అలానే వడ్డెర కాలనీకి చెందిన ఒక యువకునికి, పండరీపురంలో నివసిస్తున్న ఒక వ్యక్తికి రెండో వార్డుకు చెందిన వార్డు వాలంటీర్ గా పని చేస్తున్న ఒక మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.
చిలకలూరిపేట రూరల్:
చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన ఒక యువకుడు ఈ నెల ఆరో తేదీన బెంగుళూరు నుంచి తన స్వగ్రామమైన వేలూరు గ్రామానికి వచ్చాడు. అనుమానం ఉండటంతో ఏడో తేదీన కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. అతనికి పాజిటివ్ వచ్చినట్లు ఈరోజు అధికారులు నిర్ధారించారు. అలానే గంగంపాలెంకు చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్ నుంచి ఈ నెల 9వ తేదీన తన స్వగ్రామానికి వచ్చారు. అనుమానంతో పరీక్షలు చేయించుకున్న ఆ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారణ చేశారు.
ఎడ్లపాడు మండలం:
ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. మరణానంతర పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు నిర్ధారించారు.

