చిలకలూరిపేట: పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం
పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ చిలకలూరిపేట మండలం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారని, ఇది ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలకు విరుద్ధమని అన్నారు. జగన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ప్రజలపై విడతల వారీగా విద్యత్ భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. బిల్లులు కట్టలేక ప్రజలు గుడ్డిదీపాలు వాడే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీలు పెరగడానికి ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత నిర్ణయాలే కారణమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం గృహావసరాల విద్యుత్ చార్జీలను పెంచడంతో మధ్యతరగతి కుటుంబాలపై పెను భారం పడిందన్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఆరుసార్లు చార్జీలు పెంచారని విమర్శించారు.రాష్ట్రంలో వైసీపీ హయాంలో ఏ ఒక్క రోజు సక్రమంగా విద్యుత్ సరఫరా కాలేదని, కానీ కరెంటు బిల్లుల మోత మాత్రం మోగుతుంది అంటూ మండిపడ్డారు. విద్యార్ధులకు పరీక్షా సమయాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో విద్యుత్ సంక్షోభం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్ చార్జీలను తగ్గించాలని, అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్ అందుబాటులో లేకపోవటంతో సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సీపీఐ ఏరియా కార్యదర్శి నాగబైరు రామసుబ్బాయమ్మ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుబాని, ఏఐటీయూసీ ఏరియా అధ్యక్ష, కార్యదర్శి పేలూరి రామారావు, దాసరి వరహాలు, ఏపీ మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, నాయకులు నరసింహ భారతి, సృజన్, సి.పి.ఎం.పట్టణ కార్యదర్శి పెరుబోయిన వెంకటేశ్వర్లు,లూథర్,సాతూరి బాబు తదితరులు పాల్గొన్నారు.

