అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మానవత్వం చాటుకున్నారు. గురువారం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ మార్గం గుండా వస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని గాయపడ్డ వారిని ఆస్పత్రికి చేర్చేలా చొరవ చూపారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
పెదకాకాని మండలం రెయిన్ట్రీ పార్కు వద్ద జాతీయ రహదారిపై గురువారం ప్రైవేటు ట్రావెల్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో విజయవాడుకు చెందిన నూర్జహాన్ (22), ఉమెరా (45)లకు తీవ్ర గాయాలయ్యాయి. కొత్తగా కొనుగోలు చేసిన వాహనానికి పూజ నిమిత్తం వీరు కాకాని కు చేరుకుని పూజ ముగించుకుని తిరిగి విజయవాడ వెళ్లే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
సచివాలయంంలో డ్రగ్స్ విభాగ సిబ్బందితో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం కోసం అదే సమయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అటుగా వెళుతూ ప్రమాద ఘటనను గమనించారు. వెంటనే మంత్రి తన వాహనాలను ఆపి బాధితుల వద్దకు వెళ్లారు. 108 వాహనం వచ్చే వరకు అక్కడే ఉన్నారు. బాధితులను స్వయంగా మంత్రి వ్యక్తిగత సిబ్బంది 108 వాహనాన్ని ఎక్కించి ఆస్పత్రికి సురక్షితంగా వెళ్లేలా చూశారు. బాధితులను గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతికి మంత్రి ఫోన్ చేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.


