పేదల ఆరోగ్యానికి మంత్రి విడదల రజిని భరోసా
చిలకలూరిపేట నియోజకవర్గం క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా మార్పు కోసం కృషి
వారం రోజుల పాటు సొంత ఖర్చులు వెచ్చించి క్యాన్సర్ వైద్య శిబిరాలు
ఐదుగురు చిన్నారులకు గుండె ఆపరేషన్ కోసం సహాయం
100 మంది పేదలకు వివిధ ఆపరేషన్ల కోసం కృషి
చిలకలూరిపేట: ప్రతి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. అనుకొని పరిస్థితులు ఎదురై ఆనారోగ్యం బారిన పడితే , వారు నిరుపేదలైతే వారి కష్టం, వారి ఇబ్బందులు చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలౌతున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేదల పాలిట సంజీవనిగా మారింది. అయితే వ్యాధి వచ్చిన తర్వత చికిత్స తీసుకోవటం కంటే, అసలు ఆ వ్యాధి రాకుండా నివారణ చర్యలు తీసుకుంటే.. ముందస్తుగా వ్యాధి గుర్తించగలితే మంచి వైద్యులు సూచిస్తుంటారు. ఈ కోవలోనే చిలకలూరిపేట నియోజకవర్గంలో పేద ప్రజల కోసం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని మహోన్నత ప్రణాళిక రచించారు. మహిళల్లో ఇటీవల కాలంలో అత్యధికంగా వెలుగు చూస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు, ముందస్తు వ్యాధి నిర్ధారణకు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు కోసం తన సొంతనిధులు వెచ్చించి మహిళలకు ఆరోగ్య భరోసా కల్పించనున్నారు.
ఏం చేయబోతున్నారు...
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని ఇటీవల కాలంలో మహిళల్లో అత్యధికంగా రొమ్ము క్యాన్సర్ వ్యాధి వ్యాప్తిస్తుందని తన శాఖకు చెందిన నిపుణుల ద్వారా తెలుసుకున్నారు. ఈ క్యాన్సర్ వ్యాధి వస్తే పేదలు పడే ఇబ్బందులు, అందుకు అయ్యే వ్యయా ప్రయాసలను అధ్యయనం చేశారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన క్యాన్సర్ సదస్సుకు పాల్గొన్న సందర్బంగా పలు విషయాలు తెలుసుకున్నారు. ముందుగా తన చిలకలూరిపేట నియోజకవర్గంలోని మహిళలు ఇటువంటి వ్యాధి బారిన పడకూడదన్న ధృఢ సంకల్పంతో సొంత ఖర్చులు వచ్చించి నూతన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్స తదితర అంశాల్లో నిష్ణాతులైన ఎనిమిది వైద్యులు చెన్నై నుంచి ఇప్పటికే చిలకలూరిపేటకు చేరుకున్నారు., వీరు వారం రోజుల పాటు నియోజకవర్గంలోని రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు, ఉచిత చికిత్స, నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. చికిత్స అవసరమైన వారికి కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం కూడా ప్రణాళికలు సిద్దం చేశారు.
పేదల ఆరోగ్యానికి మంత్రి భరోసా...
చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే విడదల రజిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంపిక కావటం పేట ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా మంత్రి రజిని వెంటనే స్పందిస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్నారు. పేదలకు సైతం కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తూ భరోసా అందిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఐదుగురు చిన్నారులకు హార్ట్ హోల్ ఆపరేషన్లు చేయించారు. 100 మంది పేద వారికి వివిధ శస్త్ర చికిత్సలకు అవసరమైన చేయూత అందించారు. అంతే కాదు చిలకలూరిపేట నియోజకవర్గంలో వైద్య,ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ పీహెచ్సీ ల బలోపేతానికి చర్యలు తీసుకున్నారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ హెల్త్ క్లీనిక్ల ఏర్పాటుతో పాటు , చిలకలూరిపేట పట్టణంలో ఉన్న 30 పడకల కమ్యూనిటి హెల్త్ సెంటర్ను 100 పడకల ఆసుపత్రిగా రూపుదిద్దుకోవటానికి కృషి చేశారు. ఇది త్వరలో ప్రజలకు అందుబాటులో రానుంది. ఇది అందుబాటులో వస్తే అత్యాధునిక సేవలు పేద ప్రజలకు చేరువ కానుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతూనే రాష్ట్ర ఖ్యాతిని ఇతర రాష్ట్రాల్లోనూ ఇముడింప చేస్తున్నారు విడదల రజిని. ఈ క్రమంలోనే రాష్ట్రానికి వైద్య ,ఆరోగ్య రంగానికి రెండు అవార్డులు రావటంతో ఇటీవల సీఎం జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.



