అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లు జన్మించి 125 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలుొడ్డిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, రెండు తెలుగు రాష్ట్రాలలో 125 విద్యాసంస్థలలో 125 ప్రసంగాలు పూర్తి చేయాలన్న తలంపుతో కొనసాగుతున్న 71 సంవత్సరాల విశ్రాంత అధ్యాపకుడు తోటకూర వేంక టనారాయణ అవిశ్రాంత ప్రయాణం ఇది.....
వేలాదిమంది విద్యార్థులతో మమేకమైన ఈ అధ్యాపకునికి విశ్రాంతి లేదు. ఉద్యోగ విరమణ ఎన్నడూ అడ్డు కాలేదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎంత శ్రద్ధగా పాఠాలు బోధించాడో, రిటైర్ అయిన తర్వాత కూడా అంతకంటే శ్రద్ధగా, మరింత ఇష్టంగా భారత స్వాతంత్రోద్యమ చరిత్రను వివరిస్తున్నాడు. ఈ పాఠాలు పరీక్షల కోసం కాదు. పరిపూర్ణ జీవితం కోసం,స్వాతంత్ర్యం విలువను విద్యార్థులకు తెలియజెప్పడం కోసం. చరిత్ర అధ్యాపకునిగా, కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసిన తోటకూర వేంకటనారాయణ ఉద్యోగ విరమణ చేసి 13 సంవత్సరాలు పూర్తయింది. సహజంగా రిటైర్ అయిన వారు విశ్రాంతి తీసుకుంటూ మనుమలు,మనుమరాండ్రతో కాలక్షేపం చేస్తుంటారు. అయితే వేంకట నారాయణది విభిన్న శైలి. చరిత్ర అంటే వల్లమాలిన అభిమానం. భారత స్వాతంత్రోద్యమమన్నా, ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాటం చేసిన సమరయోధులన్నా ఎంతో ఇష్టం. ఉద్యోగ విరమణ అనంతరం తన బాధ్యత మరింతగా పెరిగిందని భావిస్తారాయన. అందుకే రాబోవు తరాల వారికి స్వేచ్ఛ స్వాతంత్రాల విలువను తెలియజెప్పాలన్న ధ్యేయంతో ఈ అసాధారణ ప్రయాణం ప్రారంభించారు. ఉరికంబాలకెక్కి ప్రాణత్యాగం చేసిన సమరయోధుల చరిత్రను విస్మరిస్తే, నేటి భావి భారత పౌరులకు "స్వాతంత్రం" విలువ ఎలా తెలుస్తుందంటారాయన.
స్వాతంత్ర సమరయోధుల స్మరణే అల్లూరి జయహే
గతం నాస్తి కాదు. అది అనుభవాల ఆస్తి.. అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఈ మాస్టారు " మనది విజయాలతో కూడిన చరిత్రయని, మన పూర్వీకుల శౌర్య గాథలు వింటే జాతీయ స్వాభిమానం బలపడుతుందని భావిస్తారు. భారతదేశపు ఉజ్వల చరిత్రను, విలువలను, సాంస్కృతిక పునాదులను నేటితరం విద్యార్థులు తెలుసుకోవాలని ఆకాంక్షిస్తారు. గతాన్ని గమనంలోకి తీసుకుంటూ భవిష్యత్తు వైపు, లక్ష్య సిద్ధి వైపు అడుగులు వేయాలి. అందుకు మొదటి మెట్టు... ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి. రకరకాల పేర్లతో స్వేచ్ఛ స్వాతంత్రాలు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించాలన్న ధ్యేయంతో ప్రాణత్యాగం చేసిన మహనీయుల స్మరణతో అది సాధ్యమవుతుందని తోటకూర వెంకటనారాయణ ప్రగాఢ విశ్వాసం.
భారత ప్రభుత్వం ప్రకటించిన " ఆజాదీకా అమృత మహోత్సవ్ " ఉద్దేశం కూడా అదే కావడంతో అందుకు అనుగుణంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే రోటరీ జిల్లా 3150 సహకారంతో చేపట్టినఅల్లూరి జయహే కార్యక్రమం. అల్లూరి, నేతాజీలతోపాటు ప్రాణత్యాగం చేసిన మరికొంతమంది విప్లవ వీరులను గూర్చి నేటి యువతరానికి తెలియజేప్పే గురుతర బాధ్యతను రోటరీ జిల్లా 3150, రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట పూర్వాధ్యక్షులు, చరిత్ర ఉపన్యాసకులు తోటకూర వెంకటనారాయణకు అప్పగించింది. 22 ఆగస్టు 2022 నాటికి అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేసి 100 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అదే రోజు అల్లూరి జయహే కార్యక్రమాన్ని సీతారామరాజు పూర్వీకుల గ్రామమైన చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో ప్రారంభించారు.
కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు కొందరు పెదవి విరిచారు. మరికొందరు ప్రయోజనం ఏమిటని సంశయించారు. అయితే వీరి ఆలోచనలకు భిన్నంగా తోటకూర వెంకటనారాయణ విద్యార్థుల ముంగిట్లోకి చొచ్చుకుపోయారు. భరతమాత దాస్య శ్రుంఖలాలను ఛేదించడంలో తమ రక్తాన్ని ధార పోసిన అల్లూరి, నేతాజీ, చంద్రశేఖర ఆజాద్ మొదలైన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఉత్తేజపూరితంగా వివరిస్తున్నప్పుడు విద్యార్థుల నుండి, ఉపాధ్యాయుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. ఉద్వేగ భరితమైన ఆ చరిత్రలు వింటూ కంట నీరు పెట్టిన విద్యార్థులెందరో ..8,9,10, ఇంటర్,డిగ్రీ,ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులకు ఇప్పటికీ 100 ప్రసంగాలు పూర్తి చేశారు. ఇప్పటివరకు గుంటూరు, ప్రకాశం, పలనాడు,బాపట్ల జిల్లాలలోని పలు ప్రాంతాలలో 72 రోజులపాటు 2781 కిలోమీటర్లు ప్రయాణించారు సుమారు 18,875 మంది విద్యార్థులకు చేరువయ్యారు.
గతంలో పాఠ్యాంశాలలో స్వాతంత్ర సమరయోధుల చరిత్రలు, వారి త్యాగాలు తప్పనిసరిగా ఉండేవి. కానీ నేటి తరం విద్యార్థులకు అటువంటి పాఠ్యాంశాలు లేకపోవడంతో విద్యార్థుల నుండి ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వ్యక్తం అవుతోంది. " అల్లూరి జయహే " జయభేరి 100 వ కార్యక్రమం గుంటూరు నగరంలోని కమ్మ జన సేవా సమితి బాలికల వసతి గృహంలో 1500 మంది విద్యార్థినుల సమక్షంలో అద్భుతంగా జరిగింది. దీని తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం,వరంగల్, లక్సెట్టిపేట, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధమైంది.
భారత స్వాతంత్రోద్యమం అత్యంత ఉద్విగ్న భరితo... తోటకూర వేంకట నారాయణ
ఇందిరాగాంధీ బంధువు గాంధీజీ అని ఒక విద్యార్థి వ్రాసిన జవాబు చదివి ఎంతో ఆవేదన చెందాను. నేటి యువతరానికి గల చారిత్రక అవగాహన లేని అర్థమయింది. వీరికి స్వాతంత్ర ఉద్యమాన్ని గూర్చిన ప్రాథమిక విషయాలు ఏమైనా తెలుసా? అనే అనుమానం కలిగింది. ఈనాడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రాలు తాతలు కూడబెట్టిన ఆస్తుల మాదిరి అప్పనంగా రాలేదని, అది లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలర్పించిన ఫలితమేనని, మనం పీలుస్తున్న స్వేచ్ఛ వాయువులు వారి త్యాగాల ఫలితమేనని నేటి యువత గ్రహించగలగాలి. అందుకు ప్రతి విద్యార్థి చరిత్రను అధ్యయనం చేయగలిగితే చాలు.. నవ భారతం మన ముందు ప్రత్యక్షమవుతుంది.
సమరయోధుల రుధిర ధారలతో ఏర్పడ్డ ఈ స్వాతంత్రం విలువ భావి భారత పౌరులకు తెలియజేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రతీచోట విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాల నుండి మంచి సహకారం లభించింది. అలానే మా రోటరీ జిల్లా 3150 గవర్నర్ శ్రీ తాళ్ల రాజశేఖర్ రెడ్డి గారు అందించిన ఆర్థిక, హార్దిక సహకారంతోనే నేనింతటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించగలుగుతున్నాను. వీరందరితోబాటు అండదండలుగా నిలిచిన మా చిలకలూరిపేట రోటరీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతాభివందనాలు.

