గంగన్నపాలెం నుంచి పల్నాడు జిల్లాకు విస్తరించిన అక్రమ బియ్యం వ్యాపారం ....
కోట్లు ఆర్జిస్తున్న ఈ బడా బాబు కథేమిటంతే..
చిలకలూరిపేట: ప్రభుత్వాల ఆశయానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అక్రమార్కులు సిండికేట్గా ఏర్పడి రాత్రి వేళ లారీలు, మినీవ్యాన్లు, ఆటో ట్రాలీలలో పొరుగు రాష్ట్రాలకు, జిల్లాలకు రహస్యంగా తరలిస్తున్నారు.
గంగన్నపాలెం నుంచి పల్నాడు జిల్లాకు విస్తరించిన అక్రమ బియ్యం వ్యాపారం ....
చిలకలూరిపేట రూరల్ మండలాల పరిధిలో ఓ వ్యక్తి అక్రమ రేషన్ బియ్యం వ్యాపారంలో ఆరితేరాడు. చిలకలూరిపేట మండలం గంగన్నపాలెంకు చెందిన ఓ బడా బాబు పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత అక్రమ వ్యాపారాన్ని విస్తరించి, బడా బాబుగా అవతరించాడు.. సాధారణ రేషన్ డీలర్ స్థాయి నుంచి కొంతమంది అండదండలతో ఏకంగా ఈ అక్రమ బియ్యం వ్యవహారంతో లక్షలాది రూపాయలు ఆర్జించటం విశేషం.
వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్దిల్లుతున్న అక్రమ బియ్యం వ్యాపారం ...
ధనం మూలం మిదం జగత్ అన్నారు పెద్దలు. దీన్ని అచ్చంగా ఫాలో అవుతాడు ఈ బియ్యం వ్యాపారి. తనకు అడ్డుగా వచ్చేవారిని, బియ్యం అక్రమ వ్యాపారాన్ని అడ్డగిస్తే డబ్బులు ఎర చూపి వారిని లోబరుచుకుంటాడు. తన అక్రమ వ్యాపార దందాను కొనసాగించటానికి సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించటానికి వెనుకాడదు. ఎదైనా తన వ్యాపారం సక్రమంగా కొనసాగాలి.. ఇందుకోసం ఎంత దూరమైనా తెగించే ఇతను అతి తక్కువ సమయంలోనే చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాలతో వ్యాపార సంబంధాలు కొనసాగించేవరకు వచ్చాడు. వినుకొండకు చెందిన మరో అక్రమ బియ్యం వ్యాపారితో సంబంధాలు కొనసాగిస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. దీంతో పల్నాడు లోని నరసరావుపేటలో ఓ ప్రాంతంలో మూడు గోడోన్లను అద్దెకు తీసుకొని, అక్కడికి సేకరించిన బియ్యం నిల్వ చేసి, అక్కడి నుంచి బియ్యం ను అక్రమంగా రవాణా చేస్తున్నాడు. కొత్త మోడల్ సెల్ ఫోన్లు, నెయ్యి,పండ్లు, డబ్బులు ఇలా స్థాయిని బట్టి అందజేస్తూ అవతని మనిషిని లోబరుకోవటంలో ఇతను సిద్దహస్తుడు. అందుకే ఇతని వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్దిల్లుతుంది.
బియ్యం తరలింపులో ఈ వ్యాపారి మరింత చాకచక్యంగా వ్యవహరిస్తాడు.. బియ్యం లారీలకు అర కిలోమీటర్ ముందు ఇతనికి చెందిన వారు కార్లలో ప్రయాణిస్తుంటారు. పొరపాటున తనిఖీల్లో పట్టుబడినా తమ పేర్లు చెప్పకూడదని లారీ యజమానులు, డ్రైవర్లతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇందుకు అవసరమైన మేర లారీ యజమానులకు, డ్రైవర్లకు ఇవ్వడంతోపలు మార్లు ఇతని బియ్యం పట్టుబడినా ఇతని పేరు బయటకు రావడం లేదన్నది జగమెరిన సత్యం. ఇతనికి చిలకలూరిపేట పట్టణానికి చెందిన ఒకరు, నాదెండ్ల మండలంలో ఇద్దరు నాయకులు తమ ఆశీస్సులు అందిస్తున్నట్లు ఆ బడా బాబు పబ్లిగ్గా చెబుతున్నాడు. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యం ప్రతినెలా పక్కదారి పట్టిస్తున్నఇతని ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

