చిలకలూరిపేట:
అందరికీ ప్రేమ అప్యాయతలు పంచుతూ, అంతా తానై నిలిచిన వ్యక్తి కనిపించకుండా పోతే... కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి అందరి ఆలనా పాలనా చూసే వ్యక్తి కానరాని లోకాలకు తరలిపోతే ... అదీ రోడ్డు ప్రమాదంలో విగత జీవిగా మారిపోతే ఆ కుటుంబ సభ్యుల ఆవేదన తీర్చే అవకాశం ఉంటుందా..? చిన్న పాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తోడేస్తున్నాయి. ప్రమాదపు రక్తపుచారికలు తడిఆరకముందే మరో చోట మరో రూపంలో సంభవిస్తున్న ప్రమాదాలు జీవితాలను కబలిస్తున్నాయి. ఆతివేగం.... జాతీయ రహదారిపై సంబవిస్తున్న అనేక ప్రమాదాలకు అతి వేగం ప్రత్యేక కారణంగా నిలుస్తుంది. మరోవైపు మానవ తప్పిదాలు ప్రమాదాలకు కారణమౌతున్నాయి . జాతీయ రహదారులపై వాహనాలు నిలపరాదన ప్రాధమిక విషయాన్ని విస్మరించటం, సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించటం ఈ ప్రమాదాలకు కారణంగా చెప్పవచ్చు. ప్రతి రోజూ జరుగుతున్న ప్రమాదాలకు మూలహేతువు నిలిచిఉన్న వాహనాల వల్ల సంభవిస్తుందటంలో సందేహం లేదు. రోడ్డు ప్రమాదాల నివారణకు కావల్సింది కోట్ల రూపాయాల నిధులు కావు. కావల్సింది సమస్యను అర్ధం చేసుకొని పరిష్కరించే మానవత్వం ఉన్న అధికారులు, పాలకులు.
విద్యార్ధుల జీవితాలతో చెలగాటం...
చిలకలూరిపేట పట్టణంలో విద్యార్ధులను చేరవేయటానికి, తిరిగి వదలటానికి సుమారు 100కు పైగా విద్యాసంస్థల బస్సులు ఉదయం సాయంత్రం సమయాల్లో పట్టణంలో తిరుగుతుంటాయి. విద్యార్దులను విద్యాసంస్థలకు చేరవేయటానికి, తిరిగి వారిని వదలివేయటానికి కొన్ని ప్రాంతాలను విద్యాసంస్థల బస్సుల నిర్వహకులు ఎంపిక చేసుకున్నారు. దీంతో చిలకలూరిపేట పట్టణానికి చెందిన విద్యార్ధులతో పాటు పరిసర గ్రామ ప్రాంతాలకు చెందిన విద్యార్ధులు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు నిలిచే ప్రదేశాలకు చేరుకొని తమ గమ్యాన్ని చేరుకుంటుంటున్నారు. పట్టణంలోని కళామందిర్ సెంటర్లో ఉదయం సమయాల్లో అత్యధిక విద్యాసంస్థలు ఇక్కడి నుంచే ప్రారంభమౌతుంటాయి. అయితే అక్కడి నుంచి బస్సు బయలు దేరిన తర్వాతా వివిధ ప్రాంతాల్లో ఉన్న విద్యార్ధులను చేరవేయటానికి కొన్ని ప్రదేశాలను బస్సుల నిర్వాహకులు నిర్ధేశించుకోవటమే ప్రమాదాలకు హేతువుగా నిలుస్తోంది. ఉదాహరణకు కేబీ రోడ్డులో పలు ప్రదేశాలతో పాటు, జాతీయ రహదారిపై అడ్డరోడ్డు సెంటర్, విజయబ్యాంకు సెంటర్ , నరసరావుపేట సెంటర్ ప్రాంతాలో విద్యార్ధులు అత్యధిక మంది వేచి ఉండి, ఈ ప్రాంతాల నుంచే రాకపోకలు కొనసాగిస్తుంటారు. అయితే బస్సుల కోసం విద్యార్ధులు వేచి ఉండే ప్రదేశాలు ప్రమాదభరితంగా ఉన్నాయి. రోడ్డు పక్కనే బస్లను నిలపటం వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం అడ్డరోడ్డు సెంటర్లో ఉదయం ఇలా బస్సు కోసం వేచి ఉన్న విద్యార్ధులపైకి ప్రైవేటు ట్రావెల్ దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఇంజీనింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వజీదా మృతి చెందగా, కట్టా కిషోర్ అనే మరో విద్యార్ధి గుంటూరులో చికిత్స పొందుతున్నాడు.
తప్పేవరిది...?
జాతీయ రహదారిపై వాహనాలను నిలపడం నిషేదం. ఇలా ఆగి ఉన్న వాహనాలతోనే గతంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆర్టీసీ, విద్యాసంస్థల బస్సులు వెనుక నుంచి వాహనాలు దూసుకువస్తున్నా ఒక్క సారిగా నిలిపివేయడటం వల్ల తరచు ప్రమాదాలు సంబవిస్తున్నాయి. ప్రస్తుతం బస్సులు నిలుపు తున్న ప్రదేశాలు కూడా జంక్షన్లకు సమీపంలో ఉండటం ప్రమాద తీవ్రత మరింత పెరగటానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అడ్డరోడ్డు సెంటర్, విజయబ్యాంకు సెంటర్, నరసరావుపేట సెంటర్ ప్రాంతాలలోని కూడళ్లలో సమీపంలోనే బస్సులు నిలపటం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి.
బస్ షల్టర్లు ఏర్పాటు చేయాలి...
ఎండా, వాన ఉన్నా ప్రమాదకరంగా జాతీయ రహదారిపైనే ప్రయాణికులు, విద్యార్ధులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సురక్షిత ప్రదేశం ఎంపిక చేసి విద్యార్ధులు, ప్రయాణికులకోసం బస్షల్టర్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. వాహనాలను నిలిపే క్రమంలో నిర్ణీత రోడ్డు మార్జీన్ ఎంపిక చేసి ఆ ప్రాంతంలోనే వాహనాలను నిలిపితే ప్రమాదాలను కొంతవరకైనా నివారించే అవకాశం ఉంది.

