ఎన్నికల ప్రచారం పరిసమాప్తికి ఇంకా కొన్ని గంటలే సమయం
పేటలో జోరందుకున్న ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం
టీడీపీలో ప్రత్తిపాటి కుటుంబం మొత్తం ఎన్నికల ప్రచారంలోనే
ప్రచారవేదికలుగా సోషల్ మీడియా...
గతంలో పోలిస్తే తగ్గిన హంగూ ఆర్భాటాలు
చిలకలూరిపేట: ఎన్నికల ప్రచారం పరిసమాప్తం కావటానికి ఇంకా కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ప్రధాన ప్రత్యర్ది పార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ చావో రేవో అన్న విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ముగియటానికి ఇంకా కొన్ని గంటల సమయమే మిగిలి ఉండటంతో ఇరు పార్టీల ప్రచారాల ఊపందుకున్నాయి. ఒకవైపు ఆత్మీయ సమావేశాల పేరుతో వివిధ సామాజిక వర్గాలు, వృత్తుల వారితో ప్రత్యేకంగా సమావేశమవుతూ, మరోవైపు వ్యూహాలు రచిస్తూ, ప్రచారం నిర్వహిస్తూ అభ్యర్ధులు బిజీగా గడుపుతున్నారు. ఉక్కపోత, వడగాల్పులు, వానలను సైతం లెక్కచేయకుండా , గంట సమయ కూడా వృధా కాకుండా ప్రజలను కలుస్తున్నారు.
వైసీసీలో కావటి, ఎంపీ అభ్యర్ది అనిల్ కుమార్ యాదవ్ల ప్రచారం...
వైఎస్సార్ సీపీలో అత్యధిక ప్రచారం మొత్తం ఎమ్మెల్యే అభ్యర్ధి కావటి మనోహర్ నాయుడే నిర్వహిస్తున్నారు. పట్టణం,పల్లెలు అనే తేడా లేకుండా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు.ప్రత్యర్ధులపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎంపీ అభ్యర్ధి పి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ప్రచారంలో అప్పుడప్పుడు పాల్గొంటున్నా అత్యధిక ప్రచారం అంతా కావటి ఒక్కరే నిర్వహించటం విశేషం. మరోవైపు కావటి ప్రచార సమయంలో ఉన్నప్పుడు ఎన్నికల వ్యూహాలు, పార్టీలో జాయినింగులు, ఇతర వ్యవహారాలు కావటి సన్నిహితులు చక్కదిద్దుతున్నారు. ప్రధానంగా వైఎస్సార్ సీపీ సంప్రదాయ ఓట్లయిన ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల ఓట్లపైనే పార్టీ నాయకులు ప్రధానంగా దృష్టి సారించినట్లు కనిపిస్తుంది. ఎంపీ అభ్యర్ధి బీసీకి కేటాయించటంతో బీసీలను సైతం అత్యధికంగా ఆకర్షించే విధంగా నాయకులు వ్యవహరచన చేస్తున్నారు.
టీడీపీలో ప్రత్తిపాటి కుటుంబం మొత్తం ప్రచారం...
ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ తరుఫున బరిలో ఉన్నారు. ఆయనకు మద్దతుగా కుటుంబం మొత్తం ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రత్తిపాటి భార్య వెంకటకుమారి, కుమార్తె స్వాతి, కుమారుడు శరత్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డులు కవర్ చేయాలన్న సంకల్పంతో ప్రత్తిపాటి వ్యూహ రచన చేసినట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రతి రోజూ నియోజకవర్గంలోని నలుమూలల టీడీపీ ప్రచారం కొనసాగుతుంది. మరోవైపు ఎంపీ అభ్యర్ధి లావు కృష్ణదేవరాయలు, ఆయన సోదరి రుద్రమదేవి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తన సాంప్రదాయక ఓటు బ్యాంకును కాపాడుకుంటునే ఎస్సీలు, మైనార్టీల ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ దృషి పెట్టింది. దీంతో పాటు అన్ని సామాజిక వర్గాలు, కుల వృత్తుల వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయడం , వారికి తాను చేయబోయే పనులను వివరిస్తూ ప్రత్తిపాటి ప్రచారం కొనసాగిస్తున్నారు.
ప్రచారవేదికలుగా సోషల్ మీడియా...
జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న నేతలు తమ ఎన్నికల ప్రచారానికి కొత్తదారిని ఎంచుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం నిర్వహించడానికి ఆస్కారమున్న సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక నిపుణులను ఎంపిక చేసుకొని నియామకం చేసుకుంటున్నారు. ఎవరికి వారు తమదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. వాట్సప్లలో నేతల పేరిట ప్రత్యేక పేజీలు, వాట్సప్లలో గ్రూపులు క్రియేట్ చేసి ఓటర్లను ఆకర్శిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే చేసే పనులను వివరిస్తూ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రచారం చేపడుతున్నారు. దీంతో క్షణాల్లో తాము చేసే పోస్టులు వందలు, వేల సంఖ్యల్లో ప్రచారం సులువుగా మారుతోందని నేతలు భావిస్తున్నారు. అభ్యర్థుల ముందస్తు షెడ్యూల్స్, దిన చర్య, ప్రచారం నిర్వహించాల్సి తీరు తదితర వాటిని సోషల్ మీడియా ద్వారా పర్యవేక్షిస్తున్నారు.
తగ్గిన హంగూ ఆర్భాటాలు
ప్రస్తుత ఎన్నికల్లో హంగూ ఆర్భాటాలు కనిపించటం లేదు. పోలింగ్కు రోజుల వ్యవధే ఉన్నా కనీసం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయట్లేదు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మండల నాయకులు సైతం పెద్దగా కాలు కదిపేందుకు అయిష్టత చూపుతున్నారు. ఎన్నికలపై గ్రామాలు, పట్టణాల్లో రచ్చబండ చర్చలు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. గతంలో పట్టణాలకు అభ్యర్థులు, ముఖ్యనాయకులు వచ్చినప్పుడు పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించి బలాన్ని ప్రదర్శించేవారు. ఇందుకోసం రోజువారీ కూలీలను రప్పించేవారు. ప్రచారం అనంతరం వారికి కూలితో పాటు భోజనం, మద్యం వంటివి పంపిణీ చేసేవారు. దీనివల్ల ఖర్చు తడిసిమోపెడయ్యేది. ర్యాలీలో ఎంతమంది పాల్గొన్నారు..? కండువాలు, టోపీలు ధరించనవారెందరు..? ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాలు ఎన్ని ఉన్నాయి..? వాటి ఇంధనం ఖర్చు తదితరాలను ఎన్నికల అధికారులు లెక్కిస్తుండటంతో వ్యయ పరిమితి దాటుతుందనే భయంతో అభ్యర్థులు వీటికి ఆసక్తి కనబరచటం లేదు. కేవలం నామినేషన్ల సందర్బంగానే మాత్రమే పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు. మొత్తం మీద ప్రచార పరిసమాప్తికి ఇంకా కొన్ని గంటల సమయమే ఉండటంతో వైసీసీ, టీడీపీ లు పోటీలు పడి ప్రచారం నిర్వహిస్తున్నారు.

