చిలకలూరిపేట, జూన్ 16: చిలకలూరిపేట పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన గాలేటి రాంబాబు (20), తన ద్విచక్రవాహనం (AP 07 CW 5311)పై తన భార్య కావేరి, మేనకోడళ్లు పాముసాని బాల సాహితీ, పామసాని వెంకట శృతి (9 సం)లను ఎక్కించుకొని కనపర్రు చర్చికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లింగంగుంట్ల వంతెన దాటిన తర్వాత వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు (AP 07 Z 0207) ఢీకొట్టడంతో ద్విచక్రవాహనం కింద పడింది.
ఈ ప్రమాదంలో బండి ట్యాంక్పై కూర్చొని ఉన్న వెంకట శృతి బస్సు కింద పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనం నడుపుతున్న రాంబాబుకు, అతని భార్య కావేరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం వెంకట శృతిని గుంటూరు జీజీహెచ్కు పంపగా, చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ప్రమాదంలో వెంకట శృతి అక్క బాల సాహితీకి ఎటువంటి గాయాలు కాలేదు.
రాంబాబు భార్య కావేరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.