చిలకలూరిపేట:నిద్రమత్తులో వాహనం నడపడం ముగ్గురు యువకుల పాలిట శాపమైంది. బాపట్ల నుండి చిలకలూరిపేట మీదుగా వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో చోటుచేసుకుంది.
ఘటన వివరాల్లోకి వెళ్తే..ప్రకాశం జిల్లా మాటూరు గ్రామానికి చెందిన విజయ్, ఏఫ్రాయుమ్, సతీష్ అనే ముగ్గురు యువకులు పని నిమిత్తం బాపట్లకు వెళ్లారు. తిరిగి తమ గ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. చిలకలూరిపేట బైపాస్ వద్దకు చేరుకోగానే, బైక్ నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారుకోవడంతో వాహనం అదుపు తప్పి వేగంగా డివైడర్ను ఢీకొట్టింది.
సకాలంలో స్పందించిన 108 సిబ్బంది:ప్రమాదం జరిగిన సమయంలో బైక్ వేగంగా ఉండటంతో ముగ్గురు యువకులు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది శోభన్ బాబు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతివేగం, నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని 108 సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు.

