ఎడ్లపాడు
ఎడ్లపాడు మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ఘోర విషాదం చోటుచేసుకుంది. జగ్గాపురం రోడ్డు సమీపంలోని చవిటి చెరువు (మంచినీళ్ల చెరువు)లో మునిగి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఎడ్లపాడుకు చెందిన షేక్ అమ్రుల్లా (12), షేక్ మొహమ్మద్ అహ్మద్ (17)గా గుర్తించారు
అసలేం జరిగిందంటే?
పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడ్లపాడుకు చెందిన మస్తాన్ కుమారుడు షేక్ అమ్రుల్లా (7వ తరగతి), ప్రస్తుతం ఎడ్లపాడులో నివాసముంటున్న బోయపాలెంకు చెందిన ఇమాంస్ కుమారుడు షేక్ మొహమ్మద్ అహ్మద్ (ఇంటర్ ప్రథమ సంవత్సరం) ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లారు. చీకటి పడుతున్నా పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో గాలించారు.
గట్టుపై లభించిన ఆధారాలు
గాలింపులో భాగంగా జగ్గాపురం రోడ్డులోని చెరువు గట్టు వద్ద అమ్రుల్లా సైకిల్, దుస్తులు, చెప్పులు కనిపించాయి. అక్కడే అహ్మద్ చెప్పులు కూడా లభించడంతో వారు చెరువులోకి దిగి ఉంటారని బంధువులు అనుమానించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ, గ్రామస్థుల సాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 30 అడుగుల లోతు ఉన్న ఈ చెరువులో బొంగు కర్రల సాయంతో వెతకగా, ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి.
చేపలు పట్టేందుకు వెళ్లి
సంఘటన స్థలాన్ని పరిశీలించగా, గట్టు వద్ద ఒక చిన్న కర్రకు గాళం కట్టి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వీరు చేపలు పట్టేందుకు ప్రయత్నించి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఉంటారని భావిస్తున్నారు. కాగా, అల్లారుముద్దుగా పెరిగిన ఇద్దరు పిల్లలు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
పోలీసుల చర్యలు: మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

