చిలకలూరిపేట: సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందిన ఘటన చిలకలూరిపేట పట్టణంలో విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పట్టణంలోని సుభాని నగర్కు చెందిన కన్నా గోపి వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతని కుమారుడు కన్నా చందు (11) మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఇతర పిల్లలతో కలిసి స్థానిక ఓగేరు వాగు వద్దకు వెళ్లాడు. ఆడుకుంటున్న క్రమంలో చందు ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోయాడు.
గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అందొచ్చిన కుమారుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుని తండ్రి గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

