చిలకలూరిపేట, జూన్ 29: పట్టణంలోని తూర్పు మాలపల్లిలో పిచ్చికుక్క స్వైరవిహారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. వీధుల్లో వెళ్తున్న వారిపైకి దూసుకొచ్చి ఆ కుక్క విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో లక్ష్మి (60) అనే వృద్ధురాలితో పాటు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది, ఈఎంటీ (EMT) శోభన్ బాబు బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.
కాగా, నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

